నాకు తెలిసినంత వరకు మహద్గురు శ్రీశ్రీశ్రీ...పూర్ణానందుల వారి భక్తులు
మరియు శిష్యులలో కొందరు ‘రథసప్తమి’ పర్వదినాన జన్మించారు. వారిలో కొందరు
శ్రీబి.ఆర్.కె. తాతగారు, ఈ కథలోని నిరూపానంద మరియు తిరుపతిలోని ఒక భక్తుడు.
ఇక కథలోనికి వెళ్దామా...
ఈ సంఘటనకి నేను ప్రత్యక్ష సాక్షిని. కనుకనే ఇంత ఘంటాపథంగా అన్నీ చెప్పగలుగుతున్నాను.
ఒకనాడు నిరూపానందకు తొండవాడలో సత్యానందస్వామి వారి రూపంలో కనిపించిన
శ్రీపూర్ణానందుల వారి నుండి రమ్మని మనోసంకేతాలు అందాయి. వెనువెంటనే
బయలుదేరి నిరూపానంద వారిని కలిశాడు. ఆ సంధ్యాకాలంలో వారు “రా శివా...! ఎలా
ఉన్నావు. ఏమిటి విశేషాలు. సాధన బాగా జరుగుతోందా” అని అడిగారు. ఇక్కడ మనం ఒక
విషయం చెప్పుకోవాలి. నేను చూసిన మహాత్ములు ఎప్పుడు కలిసినా ముందు అడిగే
ప్రశ్న “సాధన ఎలా జరుగుతోంది” అని. కానీ పరమ గురువులు మాత్రం అలా ఎప్పుడూ
అడుగలేదు. ఎందుకంటే ఆ సాధన, సాధనా ఫలం అన్నీ వారేగా...! నిరూపానందకు ఈ
విషయం అర్థం అవడానికి వారు అలా అడిగేవారు. అలా కాసేపు మాట్లాడుకున్నాక,
నిరూపానంద తాను ఇంటికి వెళ్ళడానికి అనుమతి కోరాడు. అనుమతి కోరాడు అనే కంటే
“నేను వెళ్తాను” అన్నాడు. ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే నిరూపానంద
పాదనమస్కారం చేస్తాడు, కానీ మిగతా వారి వలే కొన్ని మర్యాదలు పాటించడు. అతను
ఎంత ఒదిగి ఉంటాడో, అంత పట్టించుకోని మనస్తత్వం కూడా ఉంది. ఎందుకంటే అతని
భావం ఒకటే. “నేను సేవకుడిని... బానిసను కాను. నా భావన సేవ, బానిసత్వం కాదు”
అని. అది పరమ గురువులకు తెలుసు, అదీగాక అతనిది “సఖ్యభక్తి”. అందుకే స్వామి
వారికి ఏదైనా నివేదన చేసినపుడు తినక పోతే తిట్టి, కసిరి మరీ పెడతాడు,
తినిపిస్తాడు, అలాగే మందులు వేసుకోకపోయినా అంతే. మళ్ళీ పాదాభివందనం చేసి
మరలుతాడు. ఇలా చేయడం స్వామి వారి విషయంలోనే కాదు, అందరి విషయంలోనూ ఇంతే.
అతని ప్రేమకి (అలా అనేకంటే ‘తిక్క’కి) హద్దులుండవు. ఇలాగే వ్యక్త పరచాలనే
నియమం ఉండదు. అవతలి వారి మంచి కోసం అవసరమైనే వారిని తిడతాడు కూడా. అక్కడ
ఉన్నది శ్రీగురుదేవులా లేక ఇంకొకరా అనేది అతనికి అనవసరం. అందుకే పరమ
గురువులు వాడిని తమ చెంతనే ఉండనిచ్చారు.
ఇంకొక హాస్యాస్పదమైన విషయం
ఏమిటంటే తన గురువుకు పాదాభివందనం చేసినపుడు వారు వద్దు అని చెప్పినా,
పాదాలు వెనక్కు తీసుకున్నా, వారి పాదాలపై కొట్టి (మెల్లగానే), ఆ పాదాలను
లాక్కుని మరీ “నమస్కారం చేస్తుంటే ఎందుకు వద్దంటావు, ఎందుకు పాదాలు వెనక్కు
తీసుకుంటావు, పెట్టనివ్వు” అని కసిరి మరీ పాదాభివందనం చేస్తాడు. అందుకే
పరమగురువులు వాడిని చూసి విపరీతంగా నవ్వుతారు ఎప్పుడూ. ఏమో మర్కట
భక్తేమో...! పూర్వ వాసనలు వదలలేదోమో...! గురువుగారికే ఎరుక.
ఇలాంటి
వ్యక్తిత్వం వల్లనే, తన వాళ్ళు అనుకున్న ఇతరులందరూ అతనిని మానసికంగా
వెలివేశారు. ఇలాంటి విచిత్ర స్వభావం నా జీవితంలో ఇంకొకరిలో చూడలేదు. అయినా
గురువుల పట్ల, దైవం పట్ల తాదాత్మ్యం కలిగిన గొప్ప భక్తులు చాలామందే
ఉంటారు, కానీ ఇలాంటి ‘తేడా’ వ్యక్తిని ఉద్ధరించినప్పుడే కదా ‘శ్రీగురులీలా
విలాసం’ గురించి నాలాంటి మహా మూర్ఖశిఖామణికి అర్థం అవుతుంది. సరే ఇక కథలోకి
వెళదాం.
నిరూపానంద ‘నేను వెళతాను’ అనగానే, శ్రీసత్యానంద స్వామి వారు
‘ఎందుకంత తొందర’ అని అడిగారు. అందుకు నిరూపానంద “రేపు రథసప్తమి స్వామీ! నా
జన్మదినం. రేగుపళ్ళు, జిల్లేడు ఆకులు తీసుకు వెళ్ళాలి. నా జన్మదినం అనే
ఆసక్తి నాకు ఏమీ లేదు. కానీ శ్రీసూర్యనారాయణుల వారంటే నాకు ప్రాణం. వారికి ఆ
రోజు పూజ చేయడం నాకు చాలా ఇష్టం... ఎంతైనా అది మా నాన్న
(శ్రీసూర్యనారాయణుల వారిని నిరూపానంద అలాగే పిలుస్తాడు) జన్మదినం కదా...!
అందుకే తొందరగా వెళతాను” అన్నాడు. శ్రీ సూర్యనారాయణుల వారంటే నిరూపానందకు
ఎంత ఇష్టం అంటే తనకు తాను “ఆదిత్య” అని పేరుపెట్టుకున్నాడు కూడా.
అపుడు శ్రీసత్యానంద స్వామి వారు తమకు ఏమీ తెలియనట్లుగా, ఆశ్చర్యపోయినట్లుగా
చూస్తూ, నిరూపానంద బుగ్గ గిల్లుతూ “ఓహో...! రేపు నీ జన్మదినమా...!
రథసప్తమి నాడు జన్మించావా...! ఎంత గొప్ప విషయం. మరి నీకు ఏదో ఒక బహుమతి
ఇవాలిగా. ఉండు. ఇస్తాను. ఒక కాగితం (పేపర్) తీసుకునిరా. ‘మహాసౌరమంత్రం’
ఉపదేశిస్తాను” అని చెప్పారు. నిరూపానంద ‘సరే’ అని చెప్పి, ప్రక్కన ఉన్న
షాపులో ఒక చిన్న కాగితం తీసుకుని వెళ్ళి వారి పాదాలవద్ద కూర్చున్నాడు.
అప్పుడు శ్రీసత్యానందుల వారి రూపంలో ఉన్న మహద్గురు శ్రీశ్రీశ్రీ
పూర్ణానందుల వారు నిరూపానందకు “మహాసౌరమంత్రం” ఉపదేశించారు (ఇప్పటికీ ఎంత
వెతికినా ఆ “మహాసౌరమంత్రం” మాత్రం ఏ గ్రంథం లోనూ దొరకలేదు). అదే కాకుండా
“శ్రీసరస్వతీ మంత్రం” కూడా ఉపదేశించారు. అప్పుడు మన నిరూపానంద “నేను
‘ఆదిత్యహృదయం’ చాలా సంవత్సరాలుగా ప్రతిదినం జపం చేస్తున్నాను. నాకు ఉన్న
విచిత్రమైన అనుభూతి ఏమిటంటే ప్రత్యేకించి ‘రథసప్తమి’ నాడు
శ్రీసూర్యనారాయణుల వారికి అభిముఖంగా కూర్చుని నేను నా కనులు మూసుకుని
ముమ్మారు ఆదిత్యహృదయం జపం చేస్తాను. రెండవసారి చేసేటప్పుడు నేను
భరించలేనంతటి స్వచ్ఛమైన తెల్లటి వెలుగు (శ్వేతకాంతి) నా కనులలో
ప్రవేశిస్తుంది. మూడవసారి జపం చేసే వరకు అలాగే ఉంటుంది. పూర్తి చేసే
సమయానికి ఆ వెలుగు మాయం అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందో తెలియదు. అది నా
భ్రమ కాదు అని తెలుసు. నిజమేమిటో పూర్తిగా తెలియదు. కానీ నాకు బాగుంటుంది.
మరి ఈ మంత్రం వల్ల ఏం జరుగుతుంది?” అని వారిని అడిగాడు. అందుకు సత్యానందుల
వారు “తొందర ఎందుకు శివా...! రేపు రథసప్తమీ పర్వదినాన శిరఃస్నానం చేశాక
బ్రహ్మముహూర్తంలో తెల్లవారు ఝామున 3–4 గంటల మధ్య తూర్పుదిక్కుకు తిరిగి ఈ
“మహాసౌరమంత్రం” జపించు. నీకే అనుభవం అవుతుంది. ఇక వెళ్ళి...రా...” అన్నారు.
అలా “వెళ్ళి...రా...” అని విచిత్రంగా ఎందుకన్నారో మన వెర్రినాగన్న
నిరూపానందకు అర్థం కాలేదు. పాదాభివందనం చేయగానే శ్రీసత్యానందుల వారు, వాడి
శిరస్సుపై నిమిరి “కుండలినీ యోగవిద్యా ప్రాప్తిరస్తు” అని దీవించి, “త్వరగా
తిరిగి రా... శివా...!” అన్నారు. మన వాడు అసలే పరమ జ్ఞాని కదా! ఏదో
అనుకుని వచ్చేశాడు. తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పి...
ఇంట్లో వాళ్ళకి కూడా అన్నీ చెప్పి... నిద్రపోయి తెల్లవారుఝామున 2 గంటలకే
నిద్ర లేచి, తన తల్లి చేత శిరః స్నానం చేయించుకుని (ఇప్పటికీ అలాగే అతని
మాతృమూర్తే వానికి శిరః స్నానం చేయిస్తుంది, ఆ ఒక్క రోజు). అంతా అయ్యాక...
వాళ్ళ ఇంటి మిద్దెపైకి ఎక్కి, తూర్పు దిక్కుకు ఆసనం వేసుకుని జపం
మొదలెట్టాడు. మంత్రం ఒక సారి జపం చేశాడు. రెండవ సారి చేయగానే.........
అతని “ఊపిరి పూర్తిగా ఆగిపోయింది...”, స్పృహ కోల్పోయాడు.
మరి ఉన్నాడో, పోయాడో శ్రీశ్రీశ్రీ... మహద్గురువులకే ఎరుక...
ఏం జరిగిందో తరువాతి భాగంలో చదువుదాం...
“సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు”