మహద్గురు శ్రీపూర్ణానంద స్వామివారిని నిరూపానంద కలవడానికి మూడేళ్ళ క్రితం ఒక 55-60 ఏళ్ళ వయస్సు కలిగిన ఒక అపరిచిత బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చారు. ఆయన స్ఫురద్రూపి, చక్కని తేజస్సుతో కూడిన ముఖవర్చస్సు కలిగిన వారు. ఆయన నిరూపానంద ఇంటికి వచ్చి దాహంగా ఉంది, మంచి నీరు కావాలని అడిగారు. వచ్చిన వారు ఎవరో తెలియదు. కానీ నిరూపానంద యొక్క తల్లిగారు, వారిని లోపలికి ఆహ్వానించారు. వారికి మంచినీరు సమర్పించాక, ఆయన తన కుమార్తె వివాహం చేయడానికి తగిన ధనం లేక, సహాయం కోసం తిరుగుతూ ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. గమ్మత్తు ఏమిటంటే ఆ కాలనీలో ఆయన మరియొక ఇంటికి వెళ్ళకుండా, ఎవరినీ కలవకుండా నేరుగా నిరూపానంద ఇంటికి మాత్రమే రావడం. నిరూపానంద తల్లి ఆయనను ఏమైనా తింటారేమో అని అడిగారు. ఆయనకు ఆకలిగా ఉండుట వలన వారికి భోజనం పెట్టాక, తరువాత కాసింత విశ్రాంతి తీసుకుని, నిరూపానంద తల్లి ఇచ్చిన చీర, రవికె, కొద్దిగా పైకం తీసుకున్నారు. అటు పిమ్మట నిరూపానందను పిలిచి, "నీ గురువు నీకు దర్శనం ఇచ్చే సమయం ఆసన్నమయింది. అందుకు నేను ఒక బీజాక్షరం చెబుతాను. దానిని నీ శ్వాస ఎన్ని సార్లు నడుస్తుందో, అన్ని సార్లు జపం చేయడానికి ప్రయత్నించు. ఏ నియమాలు నీకు అవసరం లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ జపం కొనసాగించు. భవిష్యత్తులో నీ గురువు నీకు దర్శనం ఇచ్చాక అదేంటో నీకు అర్థం అవుతుంది" అన్నారు. ఇవన్నీ జరిగినది నిరూపానంద అంత క్రితం తాను తన గురువు అని అనుకున్న ఆ క్షుద్ర తాంత్రికుని వదలి వేసిన తరువాత. అసలే ఒకడిని నమ్మి 13 ఏళ్ళు కోల్పోయిన జీవితం. ఇప్పుడు అలా మరియొకరిని నమ్మవచ్చా? లేదా? అనేది తెలియదు. ఏదేమైనప్పటికీ వారి పవిత్రమైన ముఖవర్చస్సు చూశాక, నిరూపానంద మరియొక మాట మాట్లాడక సరేనన్నాడు. వెంటనే ఆయన నిరూపానందకు ఆ బీజాక్షరం ఉపదేశించారు. వారి పాదాలకు సాష్టాంగదండప్రణామములు ఆచరించిన నిరూపానంద శిరస్సు నిమిరి, ఆశీర్వదించి, వారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పటి వరకు కనబడలేదు. శ్రీపూర్ణనందుల వారిని చూశాక గాని, నిరూపానందకు అర్థం కాలేదు, వచ్చినది వారేనని. అదీగాక శ్రీపూర్ణానందుల వారు నిరూపానందకు మొదటగా ఇచ్చిన ఒక మహామంత్రంలోని బీజం కూడా అదే (దాని గురించితరువాత చెప్పుకుందాం). అప్పటికి గాని మన వాడికి బుర్రలో విషయం వెలగలేదు. అదే మాట శ్రీపూర్ణానంద స్వామీజీతో అన్నప్పుడు వారు కేవలం నవ్వి, 'అలాగా శివా! మంచిది' అన్నారు తప్ప, ఆ వచ్చింది 'నేనే' అని మాత్రం చెప్పలేదు. చిత్రం ఏమిటంటే "ఆ వచ్చినది మీరేనా?" అని నిరూపానంద స్వామి వారిని అడగ లేదు, వారు కూడా చెప్పలేదు. కానీ ఆ విషయాన్ని శ్రీకృష్ణానందేశుల వారికి చెప్పగా, వారు నవ్వి "ఇప్పటికి అర్థం అయిందా!" అని చిరునవ్వుతో తలపై చిన్నగా చరిచి, నిమిరి "నీ గురువుకు నీ మీద అపారమైన ప్రేమరా! అందుకే అనుక్షణం నిన్ను అంటిపెట్టునే ఉన్నారు. కానీ కర్మ పరిపాకం అయ్యేదాకా నీకు సత్యం బోధపడలేదు. అసలు వారే లేకపోతే నువ్వు ఎపుడో పోయి ఉండేవాడివి" అన్నారు. అప్పుడు నిరూపానంద వారిని "నేనేమీచేయను కదా! నాకేమీ రాదు కదా! అయినా నా మీద వారికెందుకు ఇంత కరుణ, ప్రేమ, వాత్సల్యం" అని అడుగగా, వారు నవ్వుతూ "గురువు ప్రేమకు కారణాలు శిష్యుడికి అర్థం కావు, ఆ అవసరం కూడా లేదు. అది గురువుకు మాత్రమే తెలుసు. నువ్వేం చేయక పోయినా అన్నీ వారే చూసుకుంటున్నారు. కేవలం వారు చెప్పినప్పుడు, ఆ పనికి నువ్వు పనిముట్టుగా మారడానికి సిద్ధపడితే చాలు. నిజానికి నిన్ను అలా మార్చేది కూడా వారే" అన్నారు. ఆలోచిస్తే మహాభారతంలో పాండవులు అన్నీ చేశాము అనుకున్నారు గానీ, చేసింది, చేయించింది అన్నీ జగద్గురు శ్రీకృష్ణపరమాత్ములే కదా!
అందుకే మన ముందుకు వచ్చిన
వారు ఎవరో మనకు తెలియకపోయినా, మనం ఏదీ ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నా, ఇవ్వడం ఇష్టం లేకపోయినా, వారిని మనం కసురుకోవడం, అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడటం వంటి పనులు
చేయకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చిన వారు ఎవరో మనకు తెలియదు
కదా. పరమగురువులు, దివ్యపురుషులు
ఎప్పడు, ఏ రూపంలో, ఏ సమయంలో వస్తారో తెలియదు. ఒకవేళ
వచ్చినవారు తప్పుడు ఉద్దేశ్యంతో వచ్చారేమో అనే భావన మనలో ఉంటే, మర్యాదగానే తప్పుకోవడం మంచిది, అంతే గాని అమర్యాదగా మాత్రం
ప్రవర్తించరాదు.
అర్థం చేసుకున్నవారికి
అర్థం అయినంత.
అంతేగా సాధకా!
తరువాయి భాగంలో మళ్ళీ
కలుద్దాం.
సర్వం
శ్రీపూర్ణానందార్పణమస్తు!