ఆత్మపథ నిర్దేశకుడు – 14
Thursday, June 4, 2026
Monday, June 1, 2026
ఆత్మపథ నిర్దేశకుడు – 13
ఆత్మపథ నిర్దేశకుడు – 13
అలా స్వామివారికి పాదసేవ (పాదాలు నొక్కడం) చేస్తున్న నిరూపానంద కళ్ళలోకి
చూసిన స్వామివారు, చిరునవ్వు
నవ్వి, “అది ప్రత్యంగిర మాలామంత్రం
శివా...! మూలమంత్రం వేరే ఉంది... అది ఉపదేశిస్తాను”
అన్నారు. అందుకు నిరూపానంద “నాకు మాలామంత్రం-మూలమంత్రాల మధ్య భేదం తెలియదు. అదీగాక
ఈ ప్రత్యంగిర ఎవరో తెలియదు. ఇంతకుముందు నరసింహ స్వామి మంత్రం చేయమంటేనే వద్దు
అన్నాను. ఇప్పుడు ఇది ఎందుకు నాకు? అవసరమా?
స్వామీ! నాకెందుకో తెలియని భయం కలుగుతోంది”అన్నాడు. అందుకు శ్రీపూర్ణానంద
స్వామివారు సుమధురమైన మందహాసంతో వాడిని చూచి, “ఇవన్నీ నువ్వు ఇంత క్రితం చేసినవే
శివా!” అన్నారు. బదులుగా నిరూపానంద “నేనా...? అసలు ఆ అమ్మవారి పేరు వినడమే
ఇప్పుడు. నేనెప్పుడూ ఆ మంత్రసాధన చేయలేదే!” అనగానే, స్వామి వారు “ఇప్పుడు అంటే ఈ జన్మలో
కాదు శివా...! క్రితం జన్మలలో నువ్వు
చేసిన సాధన ఇప్పుడు పూర్తి అయ్యే సమయం ఆసన్నమైనది. అందుకే అమ్మవారు 'రెడ్డి' ద్వారా నీకు తనను తాను
ప్రకటించుకున్నారు. నేను ఆయనకు గానీ, ఇంకెవరికీ మూలమంత్రం ఉపదేశించలేదు. ఇప్పుడు నీకు
ఉపదేశిస్తాను. దీనివలన నీకు ఎంతో మేలు ఒనగూరుతుంది. అమ్మ నీకు సర్వకాల
సర్వావస్థలలోనూ నీకు తోడుగా ఉంటుంది. ఎలాగూ నువ్వు తప్పుడు పనులకు దేనినీ వాడవు.
కనుక నీకు అర్హత ఉన్నది” అని పలికి, తన దగ్గరకు పిలిచి శ్రీ ప్రత్యంగిర మాలామంత్రం మరియు మూలమంత్రం
రెండింటినీ ఉపదేశించారు. అది విన్న వెంటనే నిరూపానంద "అరే! ఇదేంటి? మా ఇంటికి వచ్చిన బ్రాహ్మణులవారు
ఇచ్చిన 'బీజాక్షరం' ఇందులో ఉందేమిటి స్వామీ?" అని అడిగాడు. బదులుగా
స్వామివారు గుంభనంగా నవ్వుతున్నారు. మనవాడికి ఏమీ అర్థం కాలేదు. నేను అడిగితే ఈయన
నవ్వుతాడేంటి అని అనుకున్నాడు. పాపం ఈ పిచ్చివాడికి ఏం తెలుసు అప్పుడు కూడా
వచ్చినది వారేనని. గురువు ఎప్పుడు, ఎక్కడ,
ఏ రూపంలో, ఎందుకు తమ దర్శనం అనుగ్రహిస్తారో అనేది
మన వెర్రి నిరూపానందకు ఏం తెలుసు? అసలే మనవాడికి మర్కట లక్షణాలు ఎక్కువ, అంతకు మించి సందేహ ప్రాణి. అందుకే
స్వామి వారిని “ఈ మంత్రం సిద్ధి పొందాలంటే ఎన్ని లక్షలు చేయాలి. చాలామంది ఏదైనా
మంత్రాన్ని ఇన్ని వేలు, లక్షలు లేదా కోట్లు జపం చేయాలి, తద్దశాంశం హోమం లేదా తర్పణాలు, తద్దశాంశం బ్రాహ్మణ భోజనం... ఇలా ఏవేవో నియమాలు ఉంటాయి అంటారు
కదా! మరి నేనేం చేయాలి, ఎలా చేయాలి, నాకు
ఉన్న పరిస్థితులలో అవన్నీ చేయగలనా?” అని ప్రశ్నించగా, మహద్గురువులు వాడిని చూచి ప్రేమగా “అవేవీ నీకు అవసరం లేదు
శివా...! నీ దగ్గరకు వచ్చే
మంత్రాలు పూర్ణ సిద్ధిగానే వస్తాయి. నీవేమీ చేయనవసరం లేదు. జపం మాత్రం చేయి చాలు.
నువ్వు ఒక్కసారి చెప్పినా నీ వద్దకు వచ్చిన మంత్రాలు నీకు ఫలితాన్ని
అనుగ్రహిస్తాయి. శ్రీప్రత్యంగిర అమ్మవారు నీకు ఎప్పడు ఏ అవసరం వచ్చినా తీరుస్తుంది, నిన్ను అనుక్షణం కాపాడుతూనే ఉంటుంది
శివా! నీకు ఏది కావాలన్నా అడుగు అమ్మవారు ఇస్తారు” అని చెప్పగా, అందుకు నిరూపానంద తన సహజ మర్కట చాపల్య
మనస్తత్వంతో “నిజంగానే అమ్మ నేను అడిగితే స్పందిస్తారా? నమ్మవచ్చా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే
సామెత ఉంది కదా స్వామీ! అది తప్పుడు అభిప్రాయం అయినప్పటికీ, అసలే కలియుగం, అందులోనూ నాలాంటి తక్కువ స్థాయి
వాడికి, ఏమీ రానివాడికి, స్థిరత్వమే లేని వాడికి కూడా అమ్మ
అనుగ్రహం దొరుకుతుందా? అయినా
అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి?” అని ప్రశ్నల, సందేహాల పరంపర గుప్పించాడు. అందుకు విసుగు ఏమాత్రం చెందని శ్రీపూర్ణానంద
స్వామీజీ "దానిదేముంది శివా!
పరీక్షిస్తే పోతుంది" అని
నవ్వుతూ అన్నారు. అందుకు నిరూపానంద "నేను మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలతో
విసిగిస్తాను కదా...! ఏవేవో సందేహాలు పెట్టుకుంటాను కదా...! అర్థం పర్థం లేని
విషయాలు అడుగుతాను కదా! మీకు కోపం రాదా? విసుగు పుట్టదా? స్వామీ!" అని అడిగాడు.
అందుకు స్వామివారు "అవన్నీ ఎందుకు శివా! నువ్వు ఏమైనా అడుగు. ఎన్నైనా
అడుగు. నేనేమీ అనుకోను. ఇక్కడ ఉన్నదే నీకు సమాధానాలు ఇవ్వడానికి, సరైన మార్గం చూపడానికి... నీ గురువు
నీ మీద చూపించే కృప అపారం శివా...! నిన్ను శ్రీశైలంలోని సున్నిపెంటకు పూర్ణానంద స్వామి
దగ్గరకు నిన్ను తీసుకు వెళ్ళాలి శివా...!
అప్పుడు తెలుస్తుంది నీకు అన్నీ ఏమిటో! అలాగే అమ్మవారి మంత్రాన్ని
పరీక్షిస్తే సరిపోతుంది కదా! ప్రయోగించి చూడు!" అన్నారు. అప్పుడు నిరూపానంద
"అదేంటి స్వామీ! ప్రయోగాలు అంటారు... అవి క్షుద్ర మాంత్రికులు, తాంత్రికులు చేసే పనులు కదా!" అని అడుగగా, స్వామివారు నవ్వి, "అలాంటిదేమీ లేదు శివా...!
రామాయణ, భారతాలలో , పురాణాలలో ఇలా అన్నింటిలో చెప్పిన, వాళ్ళు చేసిన అస్త్రప్రయోగాల
మాటేమిటి? అంతెందుకు? సంకల్పం చెప్పేటప్పుడు నువ్వు
చేస్తున్నదేమిటి? మంత్రం
సాధనలో 'జపే వినియోగః' అని చెప్పేది ఏమిటి? అలాగే ఏదైనా సరే సత్కార్యం కోసం, ఆత్మోద్ధరణ కోసం, మోక్షసాధన కోసం, లోకోపకారం కోసం చేసే కోరికలు, ప్రయోగాలు ఉత్తమం. అలా కాకుండా
ఎవరినో బాధ పెట్టడానికి, హింసించడానికి, చంపడానికి అలాంటి ప్రయోగాలు
క్షుద్రం అవుతాయి. 'క్షుద్రం' అంటే 'నీచం' అని. తప్పుడు ఆలోచనలతో చేసే
ప్రయోగాలు నీచమైనవి శివా...! నీకు చెప్పేది అమ్మవారి మంత్రం ఫలిస్తుందో, లేదో అని నువ్వు తెలుసుకొనడానికి
చేసే చిన్న ప్రక్రియ. అంతే!" అన్నారు. అప్పుడు నిరూపానంద "ఆ ప్రయోగం
చేయాలంటే నేనేమి చేయాలి? ఎలా తెలుసుకోవాలి" అని
అడిగాడు. అప్పుడు స్వామి వారు "నీకైతే ఏ పద్ధతులు అవసరం లేదు శివా...! అమ్మ
మంత్రం చెప్పు చాలు. అలాగే
భవిష్యత్తులో భౌతికంగా నువ్వు చేయాల్సిన
ప్రయోగాలు కూడా ఉన్నాయి శివా...! వాటికి అమ్మ నీకు సహాయం చేస్తుంది' అని, శ్రీప్రత్యంగిర మంత్రం యొక్క సాధనలో
తమ అనుభవాలు చెప్పడం మొదలుపెట్టారు.
అవి ఏమిటో తర్వాతి భాగంలో తెలుసుకుందాం.
సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు||
Thursday, May 21, 2026
ఆత్మపథ నిర్దేశకుడు – 12
ఓం నమో భగవతే పూర్ణానందాయ||
నిరూపానంద ఈ విధంగా ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన శ్రీపూర్ణానంద స్వామివారు ఇచ్చిన బీజాక్షరం సాధన చేస్తూ ఉండగా, స్వామివారిని ప్రత్యక్షంగా కలిసిన కొన్ని రోజులకు ఒక సంఘటన జరిగింది. ఒకనాడు తిరుపతిలోని అతని మిత్రుడు 'రెడ్డి' గారు ఉన్నారు కదా! అతను తనకు 'ఖేచరీ' మంత్రం ఉపదేశం అయిందని చెప్పి, ఆ సాధన చేస్తున్నాను అని చెప్పారు. అదేమిటో తెలియని నిరూపానంద దాని గురించి అడుగగా, ఆయన ఆ మంత్రం విశేషాలు చెప్పి, ఆ మంత్రం తనకు శ్రీసత్యానంద స్వామి వారు ఇచ్చారు అని, కానీ దానిని తన అనుమతి లేనిదే ఎవరికీ ఇవ్వరాదని చెప్పారు కనుక ఆ మంత్రం మాత్రం చెప్పలేనని తెలిపారు. దానితో బాటు 'షణ్ముఖి' విద్య గురించి కూడా తెలిపారు. అసలు ఈ మంత్రాల గురించి మన నిరూపానందకు కనీస అవగాహన కూడా లేదు. నిజానికి అతను చేసే పూజలలో దేవతా అష్టోత్తర శత, సహస్ర నామాలు, కవచాలు ఉంటాయి గాని, ఇలాంటి మంత్రాలు తెలియవు. అదీగాక ఆ రెడ్డిగారు కుండలినీ విద్య, సాధన గురించి, ఆయుర్వేద వైద్యవిధానాలు, ఔషధాలు, రహస్యాల గురించి చెబుతూ ఉండేవారు. నిరూపానందకు అవేవీ ఎక్కకపోయినా, అర్థంకాక పోయినా పెద్దవారు చెప్పే ప్రతి మాట వినే అలవాటు ఉండుట వలన, శ్రద్ధగా ఆసాంతం వినేవాడు.
ఒకసారి నిరూపానంద శ్రీసత్యానంద స్వామి రూపంలో ఉన్న శ్రీపూర్ణానంద స్వామివారిని కలిసినప్పుడు, వారి పాదసేవ చేస్తూ, వారితో ఆ విద్యల గురించి రెడ్డిగారు చెప్పారు అని తెలుపగా, స్వామివారు "నీకు అవి అవసరం అనుకుంటే ఎప్పుడో ఇచ్చేవాడిని శివా! నీకు ఎప్పుడు, ఏది ఇవ్వాలో నీ గురువుకు తెలుసు శివా!" అన్నారు. మనవాడికేమో తన గురువు ఎవరో తెలియదు. అతను స్వామివారితో "నాకు ఆ మంత్రాల గురించి తెలియదు, వాటి అవసరం ఏమైనా నాకు ఉందేమో కూడా తెలియదు. నేను కేవలం అయన చెప్పిన విషయం మీతో చెప్పానే తప్ప, వాటి కోసం నేను ఆశించడం లేదు" అని వినయంగా చెప్పాడు. అందుకు సంతసించిన శ్రీగురుదేవులు నిరూపానందను ఆశీర్వదించి పంపారు.
ఈ చరిత్రను కొనసాగించే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ రెడ్డిగారు మరియు నిరూపానంద మధ్య ఉన్న బంధం ఒక అవినాభావ బంధం. కొందరు అది' ఆవు-దూడ' బంధం అని కూడా అనేవారు. రెడ్డిగారికి ఏమి తెలిసినా అది నిరూపానందకు చెబుతారు, అలాగే నిరూపానందకు ఏ విషయం తెలిసినా రెడ్డిగారికి చెబుతాడు. ఆ చెప్పేవాటిలో తనకు గురూపదేశం అయిన మంత్రాలు, సాధనలు, తనకు అయిన దర్శనాలు, వాటి విశేషాలు కూడా చెప్పేవాడు. ఎందుకు ఇలా చేస్తాడంటే, నిజానికి రెడ్డిగారు అత్యంత మంచి మనిషి. ఎవరికీ హాని చేసేవాడు కాదు. అలాగే మనలో చాలామంది అతను చేసే కొన్ని పనుల వంటివి పట్టించుకోము. ఉదాహరణకు మన నడుస్తూ వెళ్ళే దారిలో అక్కడక్కడ రాళ్ళు, ముళ్లు ఉంటే మనం మహా అయితే కొన్ని మాత్రం ఏరుకుంటూ, పక్కకు తొలగిస్తూ వెడతామేమో! కానీ రెడ్డిగారు అలా కాదు. ఎంతదూరం వీలైతే అంత దూరం వాటిని ఏరడం, పక్కన పడేయడం, లేదా కాలితో పక్కకు నెట్టడం. ఇలా దారిపొడుగునా చేస్తూనే ఉండేవారు. అలాగే తోటి ప్రాణుల పట్ల, మూగజీవుల పట్ల చాలా ప్రేమ చూపేవారు. అదే అలవాటు నిరూపానందకు కూడా వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి ఎప్పుడూ అలిపిరి వైపు నుండి కాలినడకన తిరుమలకు వెడుతూ ఉండేవారు. అది కాస్తా దాదాపు 20 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలపాటు, ఏ వాతావరణ పరిస్థితులోనైనా, ఎలా ఉన్నా ప్రతి శనివారం తిరుమలకు నడిచి, లేదా ద్విచక్రవాహనంలో వెళ్ళడం, అక్కడ సాధన చేయడం అలవాటుగా మారింది. నిజానికి నిరూపానంద జీవితంలో జరిగిన ప్రతి సాధనకు, దర్శనాలకు, నిదర్శనాలకు, అద్భుతాలకు అన్నింటికీ ప్రత్యక్ష సాక్షులు కొందరు ఉన్నారు. వారిలో ఈ రెడ్డిగారు మరియు ఇది వ్రాస్తున్న భిక్షువు కూడా ఉన్నారు. ఈ రెడ్డిగారు నిరూపానందకు కనిపించిన, తెలిసిన మంత్రాలు, దర్శనాలు అన్నీ విపులంగా వ్రాసేవారు.
ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు 'రెడ్డి' గారు, తనకు
స్వామివారు 'శ్రీప్రత్యంగిర' అమ్మవారి మంత్రం ఇచ్చారని, అది నిరూపానంద
కూడా చేయవచ్చునని తెలిపారు. అందుకు నిరూపానంద అంగీకరించక, ఉగ్రదేవత ఉపాసన
చేయడం పట్ల నాకు ఆసక్తి లేదు అని
తెలిపాడు. అయినా అతనిని ఒప్పించి, 'రెడ్డి' గారు ఆ మంత్రం
అతనికి నేర్పారు. మరి మనవాడు సామాన్యుడు కాదుగా, నేరుగా వెళ్ళి
సత్యానంద స్వామివారి పేరుతో నిరూపానందను అనుగ్రహిస్తున్న, శ్రీపూర్ణానంద
స్వామివారికి ఆ మంత్రం గురించి చెప్పాడు. అది వినగానే స్వామివారు ఒక్కసారిగా అతని
కళ్ళలోకి సూటిగా చూశారు. మనవాడికి ఏం చేయాలో తెలియలేదు.
అప్పుడు స్వామి వారు ఆ మంత్ర సాధన అతను చేయవచ్చునా? లేదా? ఏమన్నారు?
ఆ వివరాలు తదుపరి భాగంలో చూద్దాం.
Wednesday, May 20, 2026
ఆత్మపథ నిర్దేశకుడు – 11
మహద్గురు శ్రీపూర్ణానంద స్వామివారిని నిరూపానంద కలవడానికి మూడేళ్ళ క్రితం ఒక 55-60 ఏళ్ళ వయస్సు కలిగిన ఒక అపరిచిత బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చారు. ఆయన స్ఫురద్రూపి, చక్కని తేజస్సుతో కూడిన ముఖవర్చస్సు కలిగిన వారు. ఆయన నిరూపానంద ఇంటికి వచ్చి దాహంగా ఉంది, మంచి నీరు కావాలని అడిగారు. వచ్చిన వారు ఎవరో తెలియదు. కానీ నిరూపానంద యొక్క తల్లిగారు, వారిని లోపలికి ఆహ్వానించారు. వారికి మంచినీరు సమర్పించాక, ఆయన తన కుమార్తె వివాహం చేయడానికి తగిన ధనం లేక, సహాయం కోసం తిరుగుతూ ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. గమ్మత్తు ఏమిటంటే ఆ కాలనీలో ఆయన మరియొక ఇంటికి వెళ్ళకుండా, ఎవరినీ కలవకుండా నేరుగా నిరూపానంద ఇంటికి మాత్రమే రావడం. నిరూపానంద తల్లి ఆయనను ఏమైనా తింటారేమో అని అడిగారు. ఆయనకు ఆకలిగా ఉండుట వలన వారికి భోజనం పెట్టాక, తరువాత కాసింత విశ్రాంతి తీసుకుని, నిరూపానంద తల్లి ఇచ్చిన చీర, రవికె, కొద్దిగా పైకం తీసుకున్నారు. అటు పిమ్మట నిరూపానందను పిలిచి, "నీ గురువు నీకు దర్శనం ఇచ్చే సమయం ఆసన్నమయింది. అందుకు నేను ఒక బీజాక్షరం చెబుతాను. దానిని నీ శ్వాస ఎన్ని సార్లు నడుస్తుందో, అన్ని సార్లు జపం చేయడానికి ప్రయత్నించు. ఏ నియమాలు నీకు అవసరం లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ జపం కొనసాగించు. భవిష్యత్తులో నీ గురువు నీకు దర్శనం ఇచ్చాక అదేంటో నీకు అర్థం అవుతుంది" అన్నారు. ఇవన్నీ జరిగినది నిరూపానంద అంత క్రితం తాను తన గురువు అని అనుకున్న ఆ క్షుద్ర తాంత్రికుని వదలి వేసిన తరువాత. అసలే ఒకడిని నమ్మి 13 ఏళ్ళు కోల్పోయిన జీవితం. ఇప్పుడు అలా మరియొకరిని నమ్మవచ్చా? లేదా? అనేది తెలియదు. ఏదేమైనప్పటికీ వారి పవిత్రమైన ముఖవర్చస్సు చూశాక, నిరూపానంద మరియొక మాట మాట్లాడక సరేనన్నాడు. వెంటనే ఆయన నిరూపానందకు ఆ బీజాక్షరం ఉపదేశించారు. వారి పాదాలకు సాష్టాంగదండప్రణామములు ఆచరించిన నిరూపానంద శిరస్సు నిమిరి, ఆశీర్వదించి, వారు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పటి వరకు కనబడలేదు. శ్రీపూర్ణనందుల వారిని చూశాక గాని, నిరూపానందకు అర్థం కాలేదు, వచ్చినది వారేనని. అదీగాక శ్రీపూర్ణానందుల వారు నిరూపానందకు మొదటగా ఇచ్చిన ఒక మహామంత్రంలోని బీజం కూడా అదే (దాని గురించితరువాత చెప్పుకుందాం). అప్పటికి గాని మన వాడికి బుర్రలో విషయం వెలగలేదు. అదే మాట శ్రీపూర్ణానంద స్వామీజీతో అన్నప్పుడు వారు కేవలం నవ్వి, 'అలాగా శివా! మంచిది' అన్నారు తప్ప, ఆ వచ్చింది 'నేనే' అని మాత్రం చెప్పలేదు. చిత్రం ఏమిటంటే "ఆ వచ్చినది మీరేనా?" అని నిరూపానంద స్వామి వారిని అడగ లేదు, వారు కూడా చెప్పలేదు. కానీ ఆ విషయాన్ని శ్రీకృష్ణానందేశుల వారికి చెప్పగా, వారు నవ్వి "ఇప్పటికి అర్థం అయిందా!" అని చిరునవ్వుతో తలపై చిన్నగా చరిచి, నిమిరి "నీ గురువుకు నీ మీద అపారమైన ప్రేమరా! అందుకే అనుక్షణం నిన్ను అంటిపెట్టునే ఉన్నారు. కానీ కర్మ పరిపాకం అయ్యేదాకా నీకు సత్యం బోధపడలేదు. అసలు వారే లేకపోతే నువ్వు ఎపుడో పోయి ఉండేవాడివి" అన్నారు. అప్పుడు నిరూపానంద వారిని "నేనేమీచేయను కదా! నాకేమీ రాదు కదా! అయినా నా మీద వారికెందుకు ఇంత కరుణ, ప్రేమ, వాత్సల్యం" అని అడుగగా, వారు నవ్వుతూ "గురువు ప్రేమకు కారణాలు శిష్యుడికి అర్థం కావు, ఆ అవసరం కూడా లేదు. అది గురువుకు మాత్రమే తెలుసు. నువ్వేం చేయక పోయినా అన్నీ వారే చూసుకుంటున్నారు. కేవలం వారు చెప్పినప్పుడు, ఆ పనికి నువ్వు పనిముట్టుగా మారడానికి సిద్ధపడితే చాలు. నిజానికి నిన్ను అలా మార్చేది కూడా వారే" అన్నారు. ఆలోచిస్తే మహాభారతంలో పాండవులు అన్నీ చేశాము అనుకున్నారు గానీ, చేసింది, చేయించింది అన్నీ జగద్గురు శ్రీకృష్ణపరమాత్ములే కదా!
అందుకే మన ముందుకు వచ్చిన
వారు ఎవరో మనకు తెలియకపోయినా, మనం ఏదీ ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నా, ఇవ్వడం ఇష్టం లేకపోయినా, వారిని మనం కసురుకోవడం, అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడటం వంటి పనులు
చేయకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చిన వారు ఎవరో మనకు తెలియదు
కదా. పరమగురువులు, దివ్యపురుషులు
ఎప్పడు, ఏ రూపంలో, ఏ సమయంలో వస్తారో తెలియదు. ఒకవేళ
వచ్చినవారు తప్పుడు ఉద్దేశ్యంతో వచ్చారేమో అనే భావన మనలో ఉంటే, మర్యాదగానే తప్పుకోవడం మంచిది, అంతే గాని అమర్యాదగా మాత్రం
ప్రవర్తించరాదు.
అర్థం చేసుకున్నవారికి
అర్థం అయినంత.
అంతేగా సాధకా!
తరువాయి భాగంలో మళ్ళీ
కలుద్దాం.
సర్వం
శ్రీపూర్ణానందార్పణమస్తు!
ఆత్మపథ నిర్దేశకుడు – 10
ఇలా శ్రీదక్షిణామూర్తి వారి
‘మూర్తి’ దర్శనం జరిగిన పిమ్మట, ఒకనాడు మనం అపుడెప్పుడో మాట్లాడుకున్న, నిరూపానంద హితుడైన ‘రెడ్డి’ గారు నిరూపానందతో ‘శ్రీనృసింహస్వామి’ వారిని ఆరాధించమని చెప్పారు. నిరూపానంద దానికి ససేమిరా అంగీకరించలేదు. ఎందుకంటే అతని బంధువులలో కొందరు నృసింహ
స్వామివారిని పూజిస్తే, ఆయన ఉగ్రమూర్తి కనుక నిరూపానందకు కూడా విపరీతమైన కోపం పెరిగిపోతుందని, దానివలన అతను మతిభ్రమణకు గురి అయ్యే
అవకాశం చాలా ఉందని, ఇలా
లేనిపోని పనికిమాలిన మాటలు చెప్పడం వలన, అతను శ్రీనృసింహ స్వామివారు అన్నా... శ్రీమహాకాళి అన్నా... ఇతర ఉగ్రదేవతలు (విషయం తెలియక పోవుట వలన ‘అలా’ భావిస్తే) అన్నా... చాలా దూరంగా ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే, వారి ఆరాధన వలన తన జీవితం దారితప్పుతుంది
అని భావించేవాడు. కానీ
అతని భావనలు,
అతని బంధువుల మాటలు, ఎంతటి సత్యదూరాలో, తదనంతర కాలంలో మాత్రమే అతనికి అవగతమైంది (కేవలం శ్రీగురుని అనుగ్రహం వలన మాత్రమే).
ఇలా ఆ ‘రెడ్డి’ గారు అనగానే నిరూపానంద, నేను చేయనంటే చేయను అని వాదించాడు. ఈ సంభాషణ జరిగిన స్థలం యస్.వి. యూనివర్సిటీ గ్రంథాలయం మెట్ల మీద, రాత్రి సమయంలో. కానీ ‘రెడ్డి’ గారికి మన మహామూర్ఖశిఖామణి నిరూపానంద సంగతి మహాబాగా తెలుసు, వీడు ప్రతి మంచి పనికి ముందు ‘కాదు’ ‘వద్దు’ అంటాడు, తర్వాత చేస్తాడు అని. అలా ఆ ‘రెడ్డి’ గారి మాట కాదు అనలేక మన నిరూపానంద ‘శ్రీనృసింహ కరావలంబ స్తోత్రం’లో మొదటి శ్లోక మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాడు. తదనంతర కాలంలో, అతని జీవితంలో ఆ ‘శ్రీగురు నృసింహులవారు’ ఏ విధంగా పెనుమార్పులకు కారణం అయ్యారో... ఎందుకు ‘శ్రీలక్ష్మీనృసింహు’లను అతను తన ‘అమ్మ’ ‘నాన్న’లుగా పూర్తిగా భావించడం మొదలుపెట్టాడో తర్వాతి భాగంలో చూద్దాం.
సర్వం
శ్రీపూర్ణానందార్పణమస్తు
Monday, April 27, 2020
ఆత్మపథ నిర్దేశకుడు – 9
“సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు”
ఆత్మపథ నిర్దేశకుడు – 8
ఒకరోజు నిరూపానందను శ్రీసత్యానందస్వామి వారు ‘శ్రీదక్షిణామూర్తి’ మంత్రమును సంపాదించమని చెప్పారు. దాని అవసరం ఏముంది అని నిరూపానంద అడుగగా, “ఆ మంత్రం అవసరం నీకు ఉంది శివా...!” అని అన్నారు. ఎందుకో తెలీదు గాని స్వామివారు అడిగారు కదా అని నిరూపానంద ఆ మంత్రం కోసం చాలా వెతికాడు, కానీ ఎక్కడా దొరకలేదు. నాకు తెలిసి నిరూపానంద ఆ మంత్రం కోసం కనీసం రెండు నెలల పాటు తీవ్రంగా వెతికాడు. తన కోసం కాదు, స్వామి వారు అడిగారు అని. నిరూపానంద రామాయణ భారత భాగవతాలు, పురాణాలు మూలాగ్రంథాలు చిన్ననాటి నుండే చాలా చదివాడు, కానీ అతనికి మంత్రశాస్త్ర గ్రంథ పరిచయం తక్కువ. అతనికి ఆ మంత్రం ఏ గ్రంథంలో దొరుకుతుందో తెలియదు. అతని జీవితంలో ఒక మంత్రం కోసం ఇంతగా వెతకడం అదే మొదలు. ఒకసారి ఆ మంత్రం కోసం నిరూపానంద శృంగేరీపీఠానికి చెందిన ఒక స్వామి వారిని శ్రీదక్షిణామూర్తివారి మంత్రం ఎక్కడ దొరుకుతుందో చెప్పమని అడిగాడు, కానీ ఆ స్వామీజీ నిరూపానందతో “నీకు ఉపనయనం అయిందా? నీ సాధనా స్థాయి ఏమిటి?” ఇత్యాది ప్రశ్నలన్నీ అడిగారు. దానికి నిరూపానంద, ఆ మంత్రం తన కోసం కాదు అని, శ్రీసత్యానందస్వామి వారు అడిగారు అని, తనకు ఉపదేశం చేయనవసరం లేదు, కానీ అది ఎక్కడ లభ్యమవుతుందో మాత్రమే చెప్పమని కోరాడు. దానికి ఆ స్వామీజీ తాను ఏమీ చెప్పనని, వెళ్ళిపోమని చెప్పాడు. బాధగా వెనుదిరిగిన నిరూపానంద, తర్వాత తన కులపురోహితుల వద్దకు వెళ్ళి అడిగితే ఆయన సాయంత్రం ఇంటికి రమ్మని అన్నారు. ఆనాటి సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళిన నిరూపానంద ఆయన ఇంటి ప్రహరీ (కాంపౌండ్) గేటు బయటే రెండు గంటలకు పైగా అలా కదలక మెదలక నిలబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఆ పురోహితుడు అతనిని చూస్తూ కూడా, వేరే వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు గాని, ఇతనిని కనీసం లోపలికి రమ్మని చెప్పడు, వెళ్ళిపోమని చెప్పడు. రెండున్నర గంటల నిరీక్షణ అనంతరం ఆ కులపురోహితుడు నిరూపానందను పిలిచి “ఎందుకు వచ్చావు?” అని ప్రశ్నించాడు. నిరూపానంద శ్రీదక్షిణామూర్తి మంత్రం ఏ గ్రంథంలో దొరుకుతుందో చెప్పమని, వెళ్ళి వెదుకుతానని అడుగగా “అటువంటిదేమీ నేను చెప్పను, నీవు వెళ్లవచ్చు” అని నిర్ద్వంద్వంగా చేప్పేసరికి, నిరాశతో తన ప్రయత్నం ఫలించలేదని వెనుదిరిగాడు. ఇక్కడ నిరూపానందకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే, తాను తనకు మంత్రోపదేశం అవసరం లేదు అని , ఆ మంత్రం దొరికే గ్రంథం ఎక్కడ దొరుకుతుందో మాత్రమే చెప్పమని ఎంత వినయంగా వారి పాదాలు పట్టుకుని అడిగినా, వారు విషయం చెప్పకపోగా అతనిని అవమానకరంగా, వెటకారంగా మాట్లాడటం. అది కూడా అతని మంచికే జరిగిందని, అసలు శ్రీసత్యానందులవారు నిరూపానందకు శిక్షణ నిమిత్తమై ఇలా పని చెప్పారని చాలా కాలం తర్వాత కానీ అర్థం కాలేదు. ఇలా ఆ ఊరిలో నిరూపానంద ఒక వారం పాటు ఉండి, విఫలయత్నుడై తిరిగి స్వామి వారి వద్దకు వచ్చి అన్నీ చెప్పాడు. అందుకు స్వామి వారు “ఇంత పట్టుదలతో కూడిన నీ ప్రయత్నం వ్యర్థం కాదు శివా...! ఇక సరిగ్గా ఏడు రోజులు వెతుకు. ఏడవ రోజు దొరుకుతుంది” అని చెప్పారు.
ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.
“సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు”