ఆత్మపథ నిర్దేశకుడు – 14
ఓం నమో భగవతే పూర్ణానందాయ||
మహద్గురు శ్రీపూర్ణానంద స్వామీజీ నిరూపానందకు శ్రీప్రత్యంగిర విద్య సాధనలో శ్రీసత్యానందస్వామి వారికి కలిగిన అనుభవాలలో కొన్నింటిని ఇలా వివరించారు. "సత్యానంద స్వామి యొక్క గురువు స్వామి విమలానంద. స్వామి విమలానంద వారి గురువు స్వామి శివానంద (హృషీకేశ్). ఈ సత్యానంద స్వామికి సన్యాసం యోగం ఉంది అని జాతకంలో చూసి తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆయన పసిబిడ్డగా ఉన్నప్పుడే, హృషీకేశ్ కి వెళ్ళి, ఆ బిడ్డను స్వామి శివానంద వారికి అప్పగించారు. స్వామి శివానంద మహద్గురువులు. నిజానికి సత్యానంద స్వామి స్వామి శివానంద వారి ఒడిలోనే ఆడుకునేవాడు కూడా. తర్వాత ఆయన స్వామి శివానంద వారి ప్రెస్ లో కొంతకాలం పనిచేశారు. శివానందుల వారు దేహత్యాగం చేసిన తర్వాత, ఒక సారి తన మోక్ష సాధనకు గురువు అనుగ్రహం లభించలేదనే బాధతో సత్యానంద స్వామి విషం త్రాగి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించబోతుండగా స్వామి విమలానంద వచ్చి "చేసింది చాల్లే! ఇక బయలుదేరు" అని, తనతో తీసుకు వెళ్ళారు. స్వామి విమలానంద, ఈ సత్యానంద స్వామికి శ్రీప్రత్యంగిర మంత్రం ఉపదేశించాక, ఆయన గంగానదీ తీరంలో ఆ మంత్రం సాధన చేస్తున్నప్పుడు రెండు రాయల్ బెంగాల్ పులులు ఆయనకు దగ్గరగా వచ్చి ఆడుకోవడం మొదలెట్టాయి శివా...! వాటిని చూడగానే ఆయనకు భయం వేసింది. వెంటనే ఆయన పరుగెత్తి గంగానదిలోకి వెళ్ళి నిలబడ్డారు. అవి అలాగే కాసేపు ఆడుకుని, తరువాత వెళ్ళిపోయాయి. అటు పిమ్మట స్వామి విమలానందను కలిసినపుడు తానేమీ చెప్పక మునుపే వారు "అలా ఎందుకు భయపడి పారిపోతావు, వచ్చింది అమ్మ అయితే. నిన్ను అనుగ్రహించడానికే కదా వచ్చింది! అంత మాత్రానికే భయపడి పారిపోతావా? అది కూడా గంగానది లోకి. ఏమి? అవి నదిలోకి రాలేవు అనుకున్నావా? ఈ విషయం ఎలా మరచి పోయావు?" అన్నారు.
స్వామి విమలానంద వారు కులు మనాలి దగ్గర ఉన్న మాన్ తలాయ్ లో తపోనిష్ఠలో ఉంటారని, సంవత్సరానికి ఒకసారి తపోనిష్ఠ నుండి బాహ్య ప్రపంచానికి వస్తారని వారు తెలిపారు. అలా ఒకసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చి, సత్యానంద స్వామితో కలిసి అడవి మార్గంలో నడిచి వెడుతుండగా దాదాపు పదిమంది నక్సలైట్లు వారిని చుట్టుముట్టారు. వీళ్ళు సన్యాసుల వేషంలో ఉన్న పోలీసులేమోనని అనుమానించి వారిని చంపుతామని హెచ్చరిస్తూ, అప్పట్లో వారి దగ్గర ఉన్న అత్యాధునిక తుపాకులు ఎక్కుపెట్టగా, స్వామి విమలానంద వారిని చూచి నవ్వుతూ "మీది వృధా ప్రయాస! మమ్మల్ని చంపే ఆయుధం ఇప్పటి వరకు తయారు కాలేదు. అలాగే చంపేవాడు కూడా ఇప్పటి వరకు పుట్టలేదు. మీ తుపాకుల నుండి ఒక్క తూటా కూడా బయటకు రాదు. కావాలంటే ప్రయత్నించండి" అని అనగానే ఆ నక్సలైట్లు వారి తుపాకులు పేల్చడానికి ప్రయత్నించగా, ఆశ్చర్యకరంగా ఒక్క తూటా కూడా బయటకు రాలేదు, ఏ తుపాకీ పనిచేయలేదు. ఎంత ప్రయత్నించినా అదే తంతు. చేసేది ఏమీ లేక వాళ్ళందరూ స్వామి విమలానంద వారి పాదాలపై బడి, "మీరు మారువేషంలో ఉన్న పోలీసు ఇన్ఫార్మర్లు అనుకున్నాము, కానీ మీరు మహానుభావులు. ఈ తుపాకులు లేకపోతే పోలీసుల నుండి మమ్మల్ని మేము రక్షించుకోలేము. మా దగ్గరున్న ధనం మొత్తం మీకు ఇచ్చేస్తాము. దయచేసి మా తుపాకులు మళ్ళీ పని చేసేలా మమ్మల్ని అనుగ్రహించండి" అని వారిని వేడుకున్నారు. అందుకు స్వామి విమలానంద నవ్వుతూ "భయపడకండి. మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత మాత్రమే మీ తుపాకులు పని చేస్తాయి. మీ ధనం మాకు అవసరం లేదు" అని చెప్పి, సత్యానంద స్వామి వారితో కలిసి ముందుకు సాగారు. ఈ మొత్తాన్ని భయంతో చూస్తున్న సత్యానంద స్వామి "ఇదేమి ఆశ్చర్యం స్వామీ! వాళ్ళు చంపుతాను అంటే మీరేమో శాంతంగా ఉన్నారు. మీరు చెప్పగానే వాళ్ళ తుపాకులు కూడా పనిచేయలేదు. ఎలా?" అని అడుగగా, బదులుగా స్వామి విమలానంద నవ్వుతూ "అదేం లేదు శివా! శ్రీప్రత్యంగిర అమ్మవారి మంత్రాన్ని ప్రయోగించాను, వాళ్ళ తుపాకులు పనిచేయలేదు. అంతే...! అమ్మవారు ఉండగా మనకేమి భయం" అన్నారు.
ఇలా అమ్మవారి సాధన వివరాలు (కొన్ని గుప్తపరచవలసినవి ఉన్నాయి) నిరూపానందకు తెలిపిన శ్రీపూర్ణానంద స్వామీజీ "నువ్వు కూడా మంత్రాన్ని ప్రయోగించి చూడవచ్చు శివా! నీకే అర్థం అవుతుంది" అని అన్నారు.
ఒక సాధకుడికి మంత్ర సాధనలో ఎదురయ్యే అనుభవాల గురించి తెలియజేయడం, భవిష్యత్తులో నిరూపానందకు అటువంటి పరిస్థితి ఎదురైనపుడు వాడు భయవిహ్వలుడు కాకుండా ఉండటానికి సిద్ధపరిచేందుకు ఇవన్నీ చెప్పారు.
అంతా విన్న, తెలుసుకున్న నిరూపానంద ఆలోచిస్తూ, స్వామి వారి ఆశీస్సులు తీసుకుని, 'రెడ్డి' గారి వద్దకు వెళ్ళి, ఆయనకు కూడా అన్నింటినీ చెప్పి, ఇంటికి చేరుకొని అమ్మవారి సాధన మొదలు పెట్టాడు.
మరి స్వామి వారు చెప్పిన ప్రయోగాలు చేశాడా? లేదా?
అతనికి ఎదురైనా అనుభవాలు, అనుభూతులు ఏమిటి?
ఇలాంటివన్నీ తరువాయి భాగాలలో తెలుసుకుందాం.
సర్వం శ్రీపూర్ణానందార్పణమస్తు||
0 comments:
Post a Comment